Saturday, March 28, 2015

అద్భుత స్మశానాలు


స్మశానం అంటే పవిత్ర భూమి, ప్రశాంతమైన ప్రదేశం....కాని మనదేశంలో మాత్రం అందమైన భూమి కాలేక పోతున్నది. మనిషి పోతే విలువలేని కట్టెగా జమకట్టినట్టే మరుభూమిని సైతం విలువలేనిదిగానే చూస్తున్నాం.
కొండొకచో కొన్ని చోట్ల సుందరమైన స్మశానాలు ఉన్నా వాటి వద్ద కూడా భయపడుతూ వెళ్ళే వాళ్ళను చూస్తే అయ్యో అనిపిస్తుంది. నిజానికి అలా అనుకోనక్కరలేదు, మన స్మశానాలు అలా ఉన్నాయి. చుట్టూ భయంకరమైన దుర్గంధం, చెత్త, చెంబు తీసుకెళ్లే అందరికీ అదే రహదారి, వీటికి తోడు ఆక్రమణలకు అడ్డులేకపోవడం..ఇలా స్మశానాలు చిక్కి ముక్కి కుళ్ళిపోతున్నాయి. అందుకే అందరూ మన స్మశానాలను పబ్లిక్ టాయిలెట్స్ అంటున్నారు.

అవసరం ఆరోజుకే అనుకునే మన ఆలోచనకు పరాకాష్ట మన స్మశానాలు, మనం ముక్కు మూసుకొని మూడు గంటల్లో పని పూర్తి చేసుకు వచ్చేస్తాం, మరి జీవితానంతర కాలంలో అక్కడే శాస్వతంగా ఉండే మన పెద్దలను, పిల్లలను, హితులనూ ఇలా అందరినీ అదే కంపులో వదిలేసి వచ్చేస్తాం. మనం మారలేమా, మనను వదిలిపోయే వాళ్లకోసం మనమేం చేయలేమా... ఎలా చేస్తాం అనుకొనే ప్రశ్నే లేదు. చేయగలం ..ఎందుకంటే అలా ముందడుగు వేసిన కొందరి  కృషి పలితంగా  ఏర్పడిన సుందర వనాలు మనముందు ఎన్నో ఉన్నాయి...

అలాంటి సుందర వనాల ఒక అనుభవం -
రాజమండ్రి కైలాసభూమికి నేను నా స్నేహితుడు వెళ్ళాం, మా ముందు ఒక జంట నడుస్తున్నారు. వాళ్ళు నవ్వుకొంటూ మేము ప్రక్కకు రాగానే అడిగారు. ముందు తినడానికి షాపులేవైనా ఉంటాయా అని. ఇక్కడ షాపులేం ఉండవు, బయటకు వెళ్ళాలి. స్మశానంలో షాపులేం ఉంటాయి అన్నాను. స్మశానమా అని తుళ్ళిపడి, ఇది స్మశానమా అని మళ్ళీ అడిగారు. మేము నవ్వుతూ బయట చూసి పార్కనుకున్నరేమో స్మశానమే అటు కాలుస్తారు, ఇటు పూడుస్తారు - ఇక్కడే శవాన్ని పడుకోబెడతారు అన్నా ప్రక్క మందిరంలోని సోపానం చూపుతూ... అంతే వాళ్ళు దేవుడా స్మశానమా అనుకొంటూ ఒక్క ఉరుకుతో వెనుదిరిగి వడివడిగా బయటకు వెళ్ళిపోయారు. రాజమండ్రికి అటు ఇటు అలాంటి సూపర్ స్పెషాలిటీ సుందర స్మశానాలు ఉన్నాయి.

రాజమండ్రిలా కాకపోయినా మేమూ తీసిపోమనే విధంగా మరికొన్ని అద్భుత ఉద్యానవన స్మశానవాటికలు ఉన్నాయి- వాటిలో చెప్పుకోదగినవి. గుంటూరు మహాప్రస్థానం, పితృవనం, స్వర్గధామం,  విశాఖపట్నం లో మద్దేలపాలెం వద్ద శాంతివనం..లాంటివి... అసలు ఆ పేర్లు పెట్టటంలోనే వాటి అందం కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా తగిన వసతులతోనూ, హంగులతోనూ జీవిత కాల పోషణా ఏర్పాట్లు చేయబడినవే. వచ్చిన వాళ్ళు కూర్చొనేందుకు, వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు, ఏ.సి రూములు, ద్వాన మందిరాలు, సంతాప మండపాలు ఇలా అనేకం (మూడు రోజుల కార్యక్రమం నుండి 11 రోజుల కార్యక్రమం కూడా అక్కడే జరుపుకొనే విధంగా ఆన్ని వసతులు ఉన్నాయి)

నిజానికి మిగతా జిల్లాల కంటే గుంటూరు జిల్లాలో ఈ చైతన్యం చాలా ఎక్కువ. రాబోయే రోజుల్లో అక్కడ ఉద్యమంలా నడిచినా ఆశ్చర్యపోనక్కరలేదు.

ఏదేమైనా ఇలాంటి కొన్ని సుందర స్మశాన నిర్మాణాల జరగాలని ఇదొక ఉద్యమంలా గ్రామ గ్రామానికీ వ్యాపించి, పోయిన వారి దగ్గరకు ఎప్పుడైనా పలకరింపు కోసమైనా సరదాగా వెళ్ళిరావాలనేట్టుగా ఉండాలి
అలాంటి అద్భుత స్మశానాల నిర్మాణం అన్ని చోట్లా జరగాలి, వాటిలో అందరూ స్వేచ్చగా భయం లేకుండా గౌరవంగా తిరగాలి. మీ ఊళ్లో స్మశానం ఎలా ఉందో చూస్తారా ఇకనైనా?

No comments: