Thursday, April 2, 2015

సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం, పిఠాపురం



శతాబ్ధాల చరిత్ర కలిగిన పిఠాపురం జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఉన్నది. 1907 ప్రాంతంలో పిఠాపురం మాహారాజా సూర్యారావు గారు రాజరికానికి వచ్చిన తరువాత వారితోపాటుగా బ్రహ్మ సమాజీకులు మొక్కపాటి సుబ్బారాయుడుగారు, రఘుపతి వెంకటరత్నం నాయుడుగారు, పిఠాపురానికి దయచేసారు. అప్పటి నుండి కాకినాడ, పిఠాపురం, రాజమండ్రి వగైరా పట్టణాలలో సమాజ పరంగానూ మహారాజావారు వ్యక్తిగతంగానూ ప్రోత్సహించి సాంఘిక న్యాయం కోసం కార్యక్రమాలను చేపట్టి ఉద్యమాన్ని ముందుకు తీసుకెల్ళారు. రఘుపతి వెంకటరత్నం నాయుడు ఆదేశాaల మేరకు హరిజన, నిమ్నజాతుల అభివృద్దికై కాకినాడలో శరణాలయం, రాజమండ్రిలో వీరేశలింగ ఆస్తికపాఠశాల, పిఠాపురంలో హరిజన బాల బాలికల శరణాలయాలు స్థాపించారు. వీటిలో ఉచిత భోజన, వసతి, విద్యాభోదనలు ఏర్పాటు చేసారు. అలా పిఠాపురానికి ఉత్తేజాన్ని తీసుకొచ్చారు శ్రీ రాజావారు. అయితే ఈ మార్పు వలన రాజ వారి చుట్టూ భజన పరుల సంఖ్య ఎక్కువ చేసింది కాని సమాజంలో తగిన మార్పు తీసుకురాలేకపోయింది.  ఈ సమయంలో పురాతన సంసృతీ వ్యవస్థ, ఆధునిక బ్రహ్మ సమాజ వ్యవస్థల మద్య గ్రాంధిక బాషా బేషజాలు,  జమిందారీ వ్యవస్థ మద్య జాతీయోజ్యమం, గ్రంథాలయ పరిణామం సాగుతూ వచ్చాయి.
 
అలాంటి సమయంలో పిఠాపురం చరిత్రలో గొప్ప మలుపు చోటుచేసుకుంది. అదే సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ స్థాపన. 1915 మార్చి 16 న శ్రీ మలిరెడ్డి వెంకటరాయుడు, వేపూరి వేణుగోపాలదాసు, శ్రీ కొత్త సూయనారాయణగార్లు మరికొందరు దేశభక్తులు కలసి 16-03-1915 న  పిఠాపురంలో విద్యానంద పుస్తక భాండాగారాన్ని స్థాపించారు. పిమ్మట శ్రీ హనుమానుల సూర్యనారాయణ గుప్త గారు అదే పట్టణంలో 12-03-1916లో శ్రీ సూర్యరాయ పుస్తక భాండారాన్ని నెలకొల్పారు. దీనికి ఉపశాఖగా దామెర రామస్వామి గారి అధ్యక్షతన ఆంధ్రబాషా అభివృద్ది నాటకసమాజం అనే ఒక సంస్థను మహారాజా వారి సహకారంతో స్థాపించారు. ఈ నాటక సమాజానికి రాజావారు యాభైవేలను విరాళంగా ఇచ్చారు. ఈ విరాళంతో నాటక సమాజానికి కావలసిన హంగులు సమకూర్చుకొని వేణీ సంహారం, విజయ విలాసం వంటి నాటకాలను, కొన్ని సంసృత నాటకాలనూ రాష్ట్రమంతటా పలు చోట్ల ప్రదర్శించేవారు. ఇలా నాటక సమాజం ద్వారా ప్రదర్శనలు ఇస్తూనే పిఠాపురం రెండు గ్రంథాలయాల నిర్వహకులు గ్రంథ సేకరణ, వనరుల సేకరణలో పోటాపోటీగా పనిచేసేవారు
1917లో కలియుక భీమునిగా కీర్తింపబడిన కోడి రామ్మూర్తి గారు పిఠాపురం వచ్చినపుడు విద్యానంద గ్రంథాలయం చూసి వంద రూపాయలు విరాళంగా ఇవ్వగా, ఆ విరాళంతో పుస్తక భద్రత కొరకు నాలుగు టేకు బీరువాలు చేయించారు. అవి ఇప్పటికీ వాడుకలో ఉన్నాయి.
అయితే గ్రంథాలయ ఉద్యమంలో రెండు గ్రంథాలయాలు విడివిడిగా పనిచేయడం కంటే కలసి పనిచేస్తే మరింత భావుంటుందని తలచిన స్థానిక పెద్దల కోరిక ఫలితంగా రెండు గ్రంథాలయాలు కలపి సూర్యరాయ విద్యానంధ గ్రంథాలయంగా రూపొందించారు. ఇది సోములు బాబుగా పిలిచే దామెర స్వాముల బాబు గారి ఇంట్లో ఎక్కువ కాలం నడిచింది. తదుపరి నగరంలో రెండు మూడు ఇళ్ళు మారింది. 30 సంవత్సరాలు గడిచిన పిమ్మట పాఠకుల సంఖ్య, గ్రంథాల సంఖ్య విశేషంగా పెరగటం వలన గ్రంథాలయానికి సొంత స్థలం, భవనం సమకూర్చాలనే యోచన చేసారు.    

1942లో సోషలిస్ట్ భావాలు కల చెలికాని భావనరావు గారు, అవంత్స సోమసుందర్ గార్లు దీనికి కృషిచేసారు, గ్రంథాలయానికి సొంత భవనం సమకూర్చారు. 1944 లో కొత్త కార్యవర్గం వచ్చిన పిదప పాత బస్టాండ్‌కు సమీపాన కల పెంకుటింటికి మార్చబడినది. అలా గ్రంథాలయానికి సొంత జాగా ఏర్పడినది.  చెలికాని భావనరావు గారు కొంత కాలం ఊరు విడి వెళ్ళటం జరిగింది.

ప్రకృతి వైపరీత్యాల వలన, కొన్ని వైషమ్యాల వలన గ్రంథాలయ నిర్వహణ కుంటుపడటం, కొంత భాగం అన్యాక్రాంతం అవదం జరిగింది. సాంసృతిక కూడలిగా ఉండాలనే తలంపుతో రెండో భవనంలో కి దానిని తీసుకురావడం ద్వారా గ్రంథాలయంలో ఇతర అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. అదేకాక పెంకుటింటిలో కొంత భాగం కూలిపోగా బాగా దెబ్బతినడం జరిగింది. అయితే పుస్తకాలు చాలా వరకూ జాగ్రత్త చేయబడ్డాయి.

తిరిగి ఊరు వచ్చిన చెలికాని భావనరావు గారు పరిస్థితులను పరిశీలించి గ్రంథాలయానికి తిరిగి పూర్వ వైభవం తేవాలని  రాయవరపు సుబ్బరావు గారితో కలసి కోర్టులో గ్రంథాలయం తరపున పోరాడి రాజావారి దగ్గర నుండి 1400 రూపాయలతో భవనం, స్థలం మొత్తంగా  కొనుగోలు చేసి గ్రంథాలయం పేరుతో 1974లో రిజిస్టర్ చేయించారు. జిలా గ్రంథాలయ అద్యక్షుడైన కొప్పన వెంకట కొండలరావు గారి ప్రోత్సాహంతో తిరిగి గ్రంథాలయ నిర్వహణ ఒక దారికి తీసుకువచ్చారు.

కృష్ణశాస్త్రి, విశ్వనాధ, పి నారాయణ రెడ్డి, మల్లంపల్లి సీమశేకర శర్మ వంటి అనేక మంది ప్రముఖులను ఇక్కడ ఆహ్వానించి వారి ప్రసంగాలతో ఉత్తేజితులై వారిని సన్మానించుకొంటూ వెలిగినది. 1977 లో వజ్రోత్సవం జరిగినది. పాతూరి నాగభూషణం, ఎం. ఆర్. అప్పారావు, భాష్యం అప్పలాచార్యులు, వెంపరాల సూర్యనారాయణ శాస్త్రి మొదలైన ప్రముఖులు పాల్గొని వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు

ప్రస్తుతం ఉన్న భవనం 1977-78 లో పునర్‌నిర్మించడం జరిగింది. దీనికి నటరాజ రామకృష్ణ బృందం, కళాకృష్ణ, డా.విజయలక్ష్మీ మురళీకృష్ణ గార్లకుమార్తె తుషార, సతివాడ సూర్యనారాయణ గారి కుమార్తె రాధిక మున్నగువారు ప్రధర్శనల ద్వారా నిధులను పోగుచేసి ఇచ్చారు. దానితో పాటుగా అప్పటి గ్రంథాలయ శాఖామాత్యులు భాట్టం శ్రీరామమూర్తి గారు, జె. చోక్కారావు గార్ల సహాకారం, ఆంధ్ర నాట్య ప్రధర్శనల ద్వారా నూతన భవన నిర్మాణం జరిగింది.

గ్రంథాలయంలో కల తాళపత్రాలను జాగ్రత్త చేయుట కొరకు జిల్లా గ్రంథలయ సంస్థకు చేర్చడం జరిగింది. వాటిలో కల విలువైన జోతిష శాస్త్ర గ్రంథాలను ప్రాచీన గ్రంథాలయ రక్షణ శాఖకు తరలించారు

మాధవరావు గారి ప్రోద్భలంతో 1990 లో గ్రంథాలయ నిర్వహణ నిమిత్తం ముందు కల కాళీ స్థలంలో ముందు 3 షాపులను నిర్మించారు. వాటి ఆదాయం ద్వారా గ్రంథాలయ అభివృద్ది నిమిత్తం ఖర్చుచేస్తూఉన్నారు. తధనంతర కాలంలో మరో 4 షాపులు 2006 లో నిర్మించారు. గ్రంథాలయ పై భాగాన ఊరి ధాతల సహకారంతో మరోక అంతస్తు నిర్మించారు. దీన్లో సాంసృతిక సభలకు, సమావేశాలకు నామ మాత్రపు అద్దెతో ఇవ్వడం ద్వారా గ్రంథాలయ నిర్వహణకు మరొక వనరుగా ఏర్పరిచారు.

No comments: