Wednesday, August 26, 2015

పుస్తక ప్రపంచలో ముగ్గురు మరాఠీలు

           పుస్తక ప్రపంచం, దాంట్లో అనేకానేక గ్రంథాలయాలు విజ్ఞానాన్ని వెలుగులుగా వెదజల్లుతూ ప్రపంచ మానవాళి అభివృద్దికి మెట్లుగా మారాయి. తెలుగు పుస్తకప్రపంచంలోగ్రంథాలయాల ద్వారా వెలుగులు కురిపించి సుసంపన్న తెలుగు సాహిత్యాన్ని అందరికీ చేరువ చేసిన  ముగ్గురు ప్రముఖులు - అయ్యంకి వెంకటరమణయ్య, అయ్యదేవర కాళేశ్వరరావు, పాతూరి నాగభూషణంగార్లు

           
స్వతంత్రానికి పూర్వమే గ్రంథాలయాల ప్రాముఖ్యత తెలిసిన మేధావులైన వీరు కేవలం ఆంధ్రదేశంలోనే కాక యావత్ భారతదేశంలోనే తొలిగా గ్రంథాలయ సంఘాన్ని 1914లో స్థాపించారు. దానితో పాటుగా 1915లో 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించారు. వీటి ద్వారా అనేక గ్రంథాలయాల స్థాపనకు పాటూ పడ్డారు. తరువాత 1924లో అదే సంఘం ద్వారా 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీరు కొంత కాలం విజయవాడ కేంద్రంగా బోట్ లైబ్రరీని కూడా నడిపించారు. ఆశక్తి కలిగేలా ప్రతి ఊరిలో సభలు కార్యక్రమాలు చేస్తూ గ్రంథాలయాల స్థాపనకు పాటుపడి ముందు తరాలకు విజ్ఞానాన్ని అందించడంలో వీరు ముగ్గురూ మరాఠీల్లాగే యుక్తి, శక్తి ప్రదర్శించారు.

అయ్యంకి వెంకటరమణయ్య గారు - తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో ఆగష్టు 7, 1890 సంవత్సరంలో జన్మించాడు.  వెంకటరమణయ్య గారు విజయవాడలో ఉన్నప్పుడు, రామమోహన ధర్మ పుస్తక భాండాగారం తో అనుబంధం పెంచుకొని, ఆ గ్రoధాలయానికి కార్యదర్శి అయ్యారు. 1934-48 మధ్య, కోస్తా ఆంధ్ర ప్రాంతములో అనేక గ్రంథాలయాలు ఏర్పాటు చేశారు. 1972 లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. గ్రంథాలయ పితామహ, సరస్వతీ రమారమణ, గ్రంథాలయ విశారద వంటి బిరుదులు అందుకున్నారు.  శ్రీ అయ్యంకి వెంకటరమణయ్యగారు, దేశంలో పూర్తిస్థాయిలో గ్రంథాలయాలను నెలకొల్పిన వ్యక్తిగా పేరు గడించారు. తన 19వ ఏటనే శ్రీ బిపిన్ చంద్రపాల్ గారిని ఆదర్శంగా తీసుకొని, ప్రజాసేవ వైపు అడుగిడినారు. 1910 లో బందరులో "ఆంధ్ర సాహిత్య పత్రిక" ను స్థాపించి, గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ రచనలను ప్రచురించి, ప్రజలను చైతన్యవంతం చేశారు. 1914లో ప్రధమ ఆంధ్ర రాష్ట్ర గ్రంథ భాండాగార ప్రతినిధుల మహాసభలను విజయవాడలో నిర్వహించారు. 1919,నవంబరు-14న, చెన్నైలో తొలి "అఖిలభారత పౌర గ్రంథాలయం" ను స్థాపించి, మొదటి మహాసభను నిర్వహించారు. ఆ రోజును, 1968 నుండి, "జాతీయ గ్రంథాలయ వారోత్సవ దినం" గా జరుపుకొనుచున్నారు. వీరు అనేక గ్రంథాలయ యాత్రలను నిర్వహించి, "ప్రజా గ్రంథాలయమే ప్రజల విశ్వవిద్యాలయం" అని చాటి చెప్పారు.


పాతూరి నాగభూషణం గారు1907 ఆగస్టు 20వ తేదీన గుంటూరు జిల్లా పెదపాలెం గ్రామంలో జన్మించాడు.  గ్రంథాలయ నిర్వహణ, వయోజన విద్యాబోధన విషయాలలో అధ్యయనం చేశాడు.  ప్రాథమిక విద్య అభ్యసించే రోజుల్లోనే ఇతడు తన గ్రామంలో బాలసరస్వతీ భండారము అనే గ్రంథాలయాన్ని నెలకొల్పాడు. ఆ తర్వాత గ్రంథాలయ భవనం నిర్మించి, వేలకొలది గ్రంథాలను సేకరించి చుట్టుపక్కల నలభై గ్రామాలకు అందుబాటులో ఉంచాడు. పెద వడ్లపూడి, దుగ్గిరాల గ్రామాలలో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పాడు. బ్యాంక్ కాలువ మీది ప్రయాణీకుల పడవలలో సంచార గ్రంథాలయాన్ని నడిపాడు.  గ్రంథాలయ మహాసభలను నిర్వహించాడు. గ్రంథాలయ విద్యలో శిక్షణనిచ్చి వాటి నిర్వహణకు కావలసిన కార్యకర్తలను సమకూర్చాడు. విజయవాడ పటమటలో ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, దాని ముద్రణాలయం ఇతని చేతులమీదుగా నిర్మించబడ్డాయి. ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగాను, గ్రంథాలయ సర్వస్వము పత్రికకు సంపాదకునిగాను, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్‌కు కౌన్సిల్ మెంబరుగాను పనిచేశాడు.


అయ్యదేవర కాళేశ్వరరావు గారు
- కృష్ణా జిల్లా నందిగామ లో 1882 సంవత్సరంలో జన్మించారు. 1901 లో బి.ఎ. పరీక్షలో ఉత్తీర్ణులై నోబుల్ కళాశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేశారు. తరువాత బి.ఎల్. పరీక్షలో నెగ్గి విజయవాడలో న్యాయవాదిగా పనిచేశారు.  రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ప్రభావం వలన వీరిలో సంఘ సంస్కరణపై మక్కువతో బ్రహ్మ సమాజ కార్యక్రమాలలో కృషి చేశారు.  మహాత్మా గాంధీ నాయకత్వంలోని అన్ని ఉద్యమాలలోనూ వీరు ఉత్సాహంగా పాల్గొని కారాగార శిక్షను అనుభవించారు.

రాజకీయాలతో పాటు వీరు గ్రంథాల ప్రచురణలో శ్రద్ధ వహించారు. విజయవాడలోని రామమోహన గ్రంథాలయ స్థాపనకు సహాయం చేశారు. కొమర్రాజు లక్ష్మణరావు నెలకొల్పిన విజ్ఞాన చంద్రికా గ్రంథమండలి లో కార్యదర్శిగా పనిచేశారు. వీరు కారాగారంలో ఉండగా 'ఫ్రెంచి విప్లవ చరిత్ర', 'అమెరికా సంయుక్త రాష్ట్రాల చరిత్ర', 'తురుష్క ప్రజాస్వామికం', చీనా జాతీయోద్యమ చరిత్ర' మరియు 'ఈజిప్టు చరిత్ర' అను పుస్తకాలను రచించారు. 1926, 1937, 1946, 1955 సంవత్సరాలలో జరిగిన శాసనసభ ఎన్నికలలో విజయవాడకు ప్రాతినిధ్యం వహించాడు. ప్రజా ప్రతినిధిగా వీరు విజయవాడ పురపాలక సంఘానికి అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డారు. వీరు ఎంతోమందికి విద్యాదానము చేసారు. ఈయన విజయవాడ పురపాలక సంఘ అధ్యక్షుడిగానూ, మద్రాసు శాసనసభకు చీఫ్ విప్‌గానూ బాధ్యతలు నిర్వర్తించాడు.

No comments: